Close

జిల్లాలో జల జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 04/12/2025

గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జలజీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద కోస్తా ప్రాంతంలో తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో కన్వర్జెన్సీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ స్థితిగతులను ప్రాజెక్ట్ నిర్మాణం గుత్తేదారుడు ప్రతినిధి మెయిల్ కంపెనీ డీజీఎం పి.వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ఫేజ్ వన్ కింద పశ్చిమగోదావరి జిల్లాలో స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు రూ.1400 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు 16 మండలాల పరిధిలో 862 గ్రాములను కలుపుతూ 13.25 లక్షల కుటుంబాలకు త్రాగునీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించడం జరిగిందన్నారు. దీని నిర్మాణం కోసం 2,662 కిలోమీటర్లు మేర పైపులైన్లను వేయవలసి ఉంటుందని తెలిపారు. ఎన్ హెచ్-265, 216-A, 216, ఆర్ అండ్ బి, పంచాయతీ రోడ్లు, రైల్వే ట్రాక్ క్రాసింగ్స్, గేయిల్ పైప్ లైన్స్, ఇరిగేషన్ చానల్స్ మీదుగా పైప్ లైన్స్ నిర్మాణం చేయాల్సి ఉందని, స్ట్రక్చర్స్కు పటిష్టత దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా పైపులైన్లు నిర్మాణం చేపట్టవలసి ఉందన్నారు. ఆయా శాఖలు పైపు లైన్లు వేయుటకు అవసరమైన క్లియరెన్స్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధిత శాఖలు నిర్మాణ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. దీనికి సంబంధించి 69 ఓ హెచ్ ఆర్ ఎస్ లు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 10 నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, 10 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. 22 ప్రదేశాలలో 895 కెవిఏ విద్యుత్ సరఫరాను అందజేయవలసి ఉందని తెలిపారు. జల జీవన్ మిషన్ ఫేజ్ -2 డిపిఆర్ కూడా సిద్ధం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్ హెచ్, ఆర్ అండ్ బి, గెయిల్ నిర్మాణాల క్రాసింగ్ వద్ద నిర్మాణాలకు రెవిన్యూ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి డిఈ జి.వరలక్ష్మి, జిల్లా జల వనరుల శాఖ అధికారి సత్యనారాయణ, రైల్వేస్ భీమవరం డివిజనల్ ఇంజనీర్ ఓం ప్రకాష్, మెయిల్ డీజీఎం పి.వాసు, గెయిల్, ఎన్ హెచ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.