Close

“మొంథా తుపాను” ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలి.

Publish Date : 26/10/2025

జిల్లాలో ఎక్కడ కూడా ఏ ఒక్క ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి

తుఫాను దృష్ట్యా కార్తీక మాసం సందర్భంగా పేరుపాలెం బీచ్ లో భక్తుల సముద్ర స్నానాలకు అనుమతి లేదు

జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు 08816 – 299219

….జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

ఆదివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ” మొంథా తుఫాన్” ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే సన్నద్ధత ఏర్పాట్లపై రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మొంథా తుపాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. రేపటి నుండి మూడు రోజులు పాటు జిల్లాలో భారీగా వర్షాలు కురియనున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఎక్కడ ప్రాణ, ఆస్తి జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తుగా నరసాపురం డివిజన్లో 10, తాడేపల్లిగూడెం డివిజన్లో 8, భీమవరం డివిజన్లో 10 పునరావాస కేంద్రాలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. తుఫాను తీవ్రత, భారీ వర్షాల దృష్ట్యా మరిన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద త్రాగునీరు, భోజన సౌకర్యం తోపాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో రాబోయే వారం రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులను ఆయా ప్రాంతాలలో సిద్ధం చేసి ఉంచాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని, ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి ఒడ్డుకు తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జిల్లాలో ఉప విద్యుత్ కేంద్రాల వద్ద ముందస్తుగా జనరేటర్లు, డీజిల్ సిద్ధంగా ఉంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు ముందస్తుగా బలహీనంగా ఉన్న కాలువ గట్లు, నదీ పరివాహక ప్రాంతం గట్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. బలమైన ఈదురు గాలులు మూలంగా రోడ్లపై చెట్లు పడిపోతే సత్వరమే వాటిని తొలగించి రవాణాకు ఇబ్బందు లేకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత గ్రామాలలో ప్రజలకు నిత్యవసర సరుకులైన రైస్, షుగర్, పాలు, ఉల్లిపాయలు, కూరగాయలు, వంట నూనెలు కొరత లేకుండా అందుబాటులో ఉండే విధంగా చూడాలని పౌరుసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ బోట్లు, లైఫ్ జాకెట్లు, నిల్వ ఉన్న నీటిని తోడేందుకు మోటార్ ఇంజన్లను సిద్ధంగా ఉంచాలన్నారు భారీ వర్షాల వల్ల నీరు సాఫీగా ప్రవహించేందుకు వీలుగా డ్రైనేజీలను శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద, హాస్పిటల్స్, మొబైల్ టవర్ల వద్ద విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు జనరేటర్ లను సిద్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. పల్లపు ప్రాంతాలలో నీట మునిగిన ఇళ్ల వద్ద నుండి నీరును బయటకు తోడేందుకు మోటార్లు సిద్ధం చేసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. మండల స్థాయి కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రతను ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి ప్రత్యేక అధికారుల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు పేరుపాలెం బీచ్ లో సముద్ర స్నానాలు, గోదావరి నదిలో స్నానాలు ఆచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులకు సూచించారు. తుఫాను కు సంబంధి క్షేత్రస్థాయిలో ఏ విధమైన సమస్యలు ఉన్న కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలి అన్నారు. తుఫాను కారణంగా వాతావరణ శాఖ రానున్న మూడు రోజులలో భారీ వర్షాల హెచ్చరికల చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తతతో పూర్తి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

ఈ గూగుల్ మీట్లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, సిపిఓ కే.శ్రీనివాసరావు, డీఎస్ఓ ఎన్.సరోజ, జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తాసిల్దారులు, ఎండిఓ లు తదితరులు పాల్గొన్నారు.

1.11