రేపు పేరుపాలెం బీచ్ యోగా నిర్వహణకు సిద్ధం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
– యోగాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం
– ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
– కనుల విందుగా జరిగే బృహత్తర కార్యక్రమానికి ప్రతిఒక్కరూ ఆహ్వానితులే
– ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– భారతీయ వారసత్వ సంపద ప్రతిఒక్కరికీ చేరువకావాలి.
భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతిఒక్కరికీ చేరువచేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025లో భాగంగా జూన్ 16వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటలకు జిల్లా స్థాయి పర్యాటక ప్రాంతాలలో యోగాంధ్ర 2025 మెగా ఈవెంట్ లో భాగంగా పేరుపాలెం బీచ్ ను ఆనుకొని ఉన్న కె.పి పాలెం బీచ్ పాయింట్ నందు యోగ అభ్యసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు యోగా మెగా ఈవెంట్కు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సుమారు రెండు వేలమందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతిఒక్కరూ ఆహ్వానితులేనని. ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యోగాచరణతో సంపూర్ణ ఆరోగ్యానికి చేరువై పశ్చిమగోదావరి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో భాగస్వాములు కావాలన్నారు. మెగా ఈవెంట్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఆయుష్ శాఖ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, యోగా శిక్షకులు భాగస్వాములవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రధానమంత్రి చొరవతో నేడు యోగా విశ్వవ్యాప్తమైందని, మన ముఖ్యమంత్రి నెల రోజుల వ్యవధిలో రెండు కోట్ల మందికి యోగాను నేర్పించే లక్ష్యంతో యోగాంధ్ర-2025ను ఆవిష్కరించారని. ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిత్య యోగా ద్వారా ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పది లక్షల మందికి యోగాను నేర్పించేందుకు సర్టిఫైడ్ ట్రైనర్లతో కృషిచేస్తున్నామని. ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని. ఇప్పటికే వశిష్ట గోదావరి వలందల రేవు, పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణం, భీమవరం అల్లూరి సీతారామరాజు స్మృతి వనంలో నిర్వహించామని, రేపు పేరుపాలెం బీచ్ నందు నిర్వహించుకుంటున్నామని తెలిపారు.