విజన్ డాక్యుమెంట్ యూనిట్లు ఏర్పాటు అన్ని రంగాల్లో ముందడుగు .. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

సిపిఓ కార్యాలయంలో విజన్ డాక్యుమెంట్ జిల్లా యూనిట్ ఏర్పాటు
స్వర్ణాంధ్ర – 2047 విజన్ అమలుకు విజన్ డాక్యుమెంట్ యూనిట్లు ఏర్పాటు మరింత ఊతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి, వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు.
భీమవరం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వర్చువల్ గా తిలకించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని అన్నారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీమ్ కూడా ఇస్తున్నామని, ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒకమంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సూచించారు. జిల్లా యూనిట్ కు జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్ గాను, పార్లమెంట్ సభ్యులు వైస్ చైర్మన్ గాను, జిల్లా కలెక్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా, సిపిఓ కన్వీనర్ గా, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. అలాగే నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్కు ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ / నగర పంచాయతీ ఛైర్మన్, ఆర్డీఓ/సబ్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వికసిత్ భారత్ కు అనుగుణంగా, స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ సాధించేందుకు జిల్లా, అన్ని నియోజకవర్గాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇది అన్ని రంగాల్లో ముందడుగు అని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయ స్థాయి విజన్ డాక్యుమెంట్లు రూపొందించామని చెప్పారు. రానున్న ఈ ఐదేళ్లలో సాధించే అభివృద్దితోపాటు, 2047 నాటికి సాధించాల్సిన అభివృద్దిని కూడా ఈ డాక్యుమెంట్లలో పొందుపరచడం జరిగిందని చెప్పారు. ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడం, ఉద్యోగాలను ఇవ్వడం, మౌలిక వసతులను కల్పించడం, అభివృద్ది తదితర అంశాలు ఈ యాక్షన్ ప్లాన్లో ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విజనరీ ముఖ్యమంత్రిగా పేరుందని, ఆయన రూపొందించిన విజన్ ప్లాన్ భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ఏడాదిలోనే దీనికి పునాది పడిందని చెప్పారు. ప్రతీ నియోజకవర్గానికీ ఐదుగురు సభ్యుల బృందాన్ని కూడా నియమించామన్నారు. అసమానతలను తొలగించేందుకు పి4 విధానం ఒక మార్గమని అన్నారు.