స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నివేదిత విద్యాలయం ఏర్పాటు అభినందనీయం–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పేద ఆడపిల్లలకు ప్రాధాన్యత..
కాళ్ల మండలం పెద్దఆమిరంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నివేదిత విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం నివేదిత విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, గుంటూరు శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ చేతులు మీదుగా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. తరగతి గదులలో కల్పించిన మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించి, కొద్ది సమయం తరగతి గదిలో బెంచి పై కూర్చుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భావితరాలకు విద్యతో పాటు విలువలతో కూడిన మన సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పి ఉత్తములుగా తీర్చిదిద్దటమే లక్ష్యంతో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పేద బాలికలకు ఉచిత విద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. జిల్లాలో వివేకానంద సేవాసమితి మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
గుంటూరు శారద మఠం అధ్యక్షురాలు ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఎల్ కె జి నుండి 7వ తరగతి వరకు పేద బాలికలకు మాత్రమే విద్యను అందించడం జరుగుతుందన్నారు. సుమారు 770 మంది బాలికలకు ప్రవేశం కల్పించనునట్లు తెలిపారు. తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుందని అన్నారు.
అనంతరం నివేదిత విద్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ప్రవాజిక భవాణి ప్రాణమాతాజీ చేతుల మీదుగా స్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో ప్రవాజిక త్యాగ మాతాజీ, త్యగానిష్ట దివ్యఆత్మ ప్రాణమాతాజీ, తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి, రామకృష్ణ శారదా మిషన్ సభ్యులు డాక్టర్ లింగారెడ్డి ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.