దివ్యాంగులు, దీర్ఘకాలిక అస్వస్ధులు, వయోవృద్ధులు రేషన్ సరుకులు పొందడంలో చింత లేదని, వారి ఇంటి వద్దనే డీలర్లు అందజేస్తున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు

దివ్యాంగులకు, అస్వస్ధులకు, వయోవృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు..
ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
రేషన్ పంపిణీ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
నచ్చిన సమయంలో నచ్చిన తేదీన రేషన్ పొందే సౌలభ్యం ..పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
మంగళవారం భీమవరం పట్టణం ఏడవ వార్డు గాంధీనగర్ లో స్థానిక రేషన్ డీలర్ నారి నరసింహారావు దీర్ఘకాలం అస్వస్థతతో మంచానికే పరిమితమైన గుమ్మళ్ళ రామారావు, వయోవృద్ధులు సిద్ధిరెడ్డి రామారావు కుటుంబాల ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేస్తున్న రేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జూన్ నెల నుండి మీ ఇంటి వద్దకే డీలర్ స్వయంగా వచ్చి రేషన్ అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంలో ఆ కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రేషన్ వాహనం ఒక ప్రాంతంలో ఉంచితే అక్కడికి వెళ్లి రేషన్ తీసుకోవాల్సి వచ్చేదని, అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధులైన అయిన మాకు ఆ కాస్త దూరం కూడా చాలా భారంగానే ఉండేదన్నారు. ఎవరో ఒకరిని బ్రతిమాలుకుని ఇంటికి చేర్చుకునే పరిస్థితి ఉండేదన్నారు. రేషన్ వాహనం కూడా ఒకరోజు మాత్రమే వచ్చేదని, అది ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేదన్నారు. మాలాంటి వారికి రేషన్ అందజేసే భారాన్ని రేషన్ డీలర్ పై ఉంచి, ఇంట్లోకి తెచ్చిఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం చాలా హర్షించదగిన విషయం అన్నారు. గతంలో ఎన్నడు ఇటువంటి అవకాశాన్ని మేము పొందలేదు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ లబ్ధిదారునికి వెసులుబాటు ఉన్న సమయంలో రేషన్ సరుకులు నిరభ్యంతరంగా పొందవచ్చునన్నారు. అలాగే దివ్యాంగులు, అస్వస్థతతో మంచానికి పరిమితమైనవారికి, వయో వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ స్వయంగా తీసుకెళ్లి డీలర్లు అందజేస్తున్నారన్నారు. జిల్లాలోని మొత్తం 1,052 చౌక ధరల దుకాణాల పరిధిలో 5,58,019 రేషన్ కార్డులు ఉండగా, జూలై మూడు నాటికి 1,78,583 మంది లబ్ధిదారులు స్వయంగా చౌక ధరల దుకాణానికి వచ్చి రేషన్ తీసుకు వెళ్ళడం జరిగిందని, 32 శాతం రేషన్ పంపిణీ పూర్తయింది అని తెలిపారు. అలాగే జిల్లాలో మొత్తం 70,770 మంది దివ్యాంగులు, వయో వృద్ధులు ఉండగా జూన్ 3 నాటికి 21,050 రేషన్ కార్డుదారులకు స్వయంగా డీలర్ ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందజేయడం జరిగిందన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8.00 గంటల నుండి మ.12.00 గంటల వరకు మరియు సా.4.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సాధారణ లబ్ధిదారునికి వెసులుబాటు ఉన్న సమయంలో రేషన్ షాపు వద్దకు స్వయంగా వెళ్లి సరుకులను పొందవచ్చుఅన్నారు. మిగిలిన లబ్ధిదారులకు ప్రతినెల ఒకటో తేదీ నుండి 5వ తేదీ మధ్య మ.12.00 గం.ల నుండి సా.4.00 గంటల వరకు రేషన్ డీలర్ స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి సరుకులను అందజేస్తారని తెలిపారు. పారదర్శకంగా అమలు చేస్తున్న రేషన్ పంపిణీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ పొందడంలో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం తహసీల్దార్ రావి రవికుమార్, డీ.ఎస్.ఓ సరోజ, ఏఎస్ఓ రవిశంకర్, సిఎస్ ఆర్ఐ ఏ.సురేష్, వీఆర్వో ఏ సూర్యకాంతం, తదితరులు ఉన్నారు.