స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి తణుకు రాక ..

సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాల పరిశీలన…
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్నారు. ఈ మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లొగన్ తో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజ్ లో హెలిపాడ్, ఆడిటోరియం, జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ నందు ప్రజా వేదిక, స్టాల్స్ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాల పరిశీలన చేయడం జరిగింది. బుధవారం ఆయా ప్రాంతాలను ముఖ్యమంత్రి కార్యాలయం సెక్యూరిటీ వింగ్ పరిశీలన చేసిన అనంతరం ఖరారు చేయడం జరుగుతుంది. పాలిటెక్నిక్ కళాశాలలోని ఆడిటోరియం నందు సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. జడ్పీ స్కూల్ నందు సభా ప్రాంగణంలో సుమారు మూడు వేల మందితో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశమై ప్రసంగించనున్నారు. అదే ప్రాంగణంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించనున్నారు.
స్థల పరిశీలన అనంతరం తణుకు మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో సమావేశమై ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తణుకు పట్టణంలో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. బారికేడింగ్ కు ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని, హెలిప్యాడ్ ను సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన విద్యుత్ లైన్స్ ఏర్పాటు చేయడంతో పాటు, జనరేటర్లను కూడా సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. భోజన ఏర్పాట్లను డీఎస్ఓ, డి.ఎం లు పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత హెచ్చుగా ఉంటున్నందున సభా ప్రాంగణంలో త్రాగునీరు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, తాడేపల్లిగూడెం, నరసాపురం ఆర్డీవోలు కతీబ్ కౌసర్ భానో, దాసిరాజు, డి.ఎస్.పి డి.విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ టి.రాంకుమార్, తహసిల్దార్ డివివిఎస్ అశోక్ వర్మ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తులసీరాధ, హెడ్మాస్టర్లు కే.పద్మావతి, పి.వరలక్ష్మి, స్థానిక నాయకులు టి.మారుతీ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.