స్వచ్ఛతహి సేవ 2025లో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత”

ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత సాధ్యం
ప్రజా చైతన్యంతో మంచి కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
వ్యర్థాలను చెత్త బుట్టలోనే వేయాలి.
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆనందం అని, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రత పై బాధ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
స్వచ్ఛతహి సేవ 2025లో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత” స్వచ్ఛత కార్యక్రమంలో గురువారం భీమవరం పట్టణంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద అడ్వెర్డాన్ ట్యాంక్ చుట్టూ మున్సిపల్ కార్పొరేషన్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు మెప్మా, మహిళలు చేపట్టిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కొడవలి చేతపట్టి చెత్తను తొలగించి పరిశుభ్రత పై ప్రజలలో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని అన్నారు గౌరవ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మహాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మన పరిసరాల పరిశుభ్రతతో సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఆరోగ్యమైన సమాజంతో అభివృద్ధి సాధ్యం అన్నారు. ప్రజల చైతన్యంతో ఇలాంటి మంచి కార్యక్రమాలలో స్వచ్ఛంద సంస్థల సహకారం తో ముందుకు రావాలని కోరారు. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో అడ్వెర్డాన్ ట్యాంకు ఎంతో కాలము నుండి నిరుపయోగముగా ఉంటుందని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో రోటరీ క్లబ్ అధ్యక్షులు కిషోర్, పెద్దలు సుబ్బారావు, జూపూడి సంజయ్య, గార్ల సారధ్యంలో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ట్యాంకు చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వాక్ చేయడానికి అణువుగా అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. బోట్ షికార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అందరి సహకారంతో రోటరీ క్లబ్ వారు ముందుకు వచ్చి శ్రమదానంలో పాల్గొన్న వారందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన ట్యాంకు చుట్టూ ప్రజలు వాకింగ్, పిల్లలు ఆడుకోవడానికి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ప్రజలు ముందుకు వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు శ్రమదానం చేసుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుందని ఆన్నారు. కనీసం రోజుకో గంటపాటైనా సమాజానికి సేవ చేయడం ప్రతీఒక్కరికీ స్ఫూర్తి కావాలని సూచించారు. మన ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్నారు. దీనివల్ల పరిసరాలు శుభ్రంగా ఉండటంతోపాటు, పర్యావరణ పరిరక్షణ, వివిధ రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతుందని సూచించారు. అందువల్ల ప్రతీఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములుకావాలని కోరారు. మన ఊరు బాగుండాలంటే అందుకు మనమే ముందుడగు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నేడు శ్రమధానం కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని, నగరంలో ప్రతి రోజూ ఏర్పడే చెత్తలో సుమారు 50 శాతం చెత్తను ప్రజలు పార్కులు, బస్ స్టాండ్, మార్కెట్ లు, పుర వీధులలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్ లు, బిస్కట్ మరియు చాక్లెట్ కవర్ లు, ఇలా భాధ్యత లేకుండా పడేస్తున్నారని, దీని కారణంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, పని భారం పెరుగుతుందన్నారు. విద్యార్థులు కూడా పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండి, వారి తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద మెరుగైన పారిశుధ్యం ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిందన్నారు. దీనితో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాల వద్ద పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యం నిర్వహించాలని ఆదేశించిందన్నారు.
మున్సిపల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతీరోజు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం జరుగుతోందని చెప్పారు. అయినప్పటికీ కొంతమంది చెత్తను పారిశుధ్య కార్మికులకు ఇవ్వకుండా, కాలవల్లోను, రోడ్ల ప్రక్కనా వేసేస్తున్నారని చెప్పారు. ఈ అలవాటును మానుకోవాలని, కార్మికులు ఇంటివద్దకు వచ్చినప్పుడే చెత్తను అందజేయాలని సూచించారు. మన భీమవరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతీఒక్కరూ తమవంతు సహకారాన్ని అందజేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఎం. హెచ్ ఓ సోమశేఖర్,
సి ఎం ఓ శివప్రసాద్, రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండు కిషోర్, ట్రెజరర్ బొండా వెంకట సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ నడిపెల్లి నరసింహారావు, డైరెక్టర్స్ మడిపల్లి శేఖర్, ఎస్విఆర్ సి జయవర్మ, షేక్ బాబాజీ సాహెబ్, సభ్యులు గుండు గిరి, సుధీర్, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.