స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో ఖచ్చితమైన నిబంధనలను అమలు చేయడంతో పాటు, 18 సంవత్సరాలలోపు ఆడపిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలకు లైసెన్సులు జారీలో పక్కాగా నిబంధనలను పాటించాలని సూచించారు. తల్లిదండ్రులులేని పిల్లలను, భిక్షాటన చేసే పిల్లలను, బాల కార్మికులను గుర్తించి హోమ్ ఉంచి కచ్చితంగా చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు. ఆరు సంవత్సరాల లోపు పిల్లలను వదిలేసిన, అనధికారికంగా దత్తత ఇచ్చిన ఇటువంటి వారిని గుర్తించి శిశు గృహాల్లో ఉంచి చట్టబద్ధంగా దత్తతను ఇవ్వాలని సూచించారు. 18 సంవత్సరాలు లోపు ఆడ, మగ పిల్లల్లో తల్లిదండ్రులు లేని వారిని, తల్లిగాని తండ్రిగాని ఒక్కరు మాత్రమే ఉన్నవారి డేటాను గ్రామ సచివాలయంలోని మహిళా పోలీసులు సేకరించి బాల్య వివాహాలు, ట్రాఫికింగ్ జరక్కుండా సంరక్షించేందుకు అధికారులకు సమాచారం అందించాలన్నారు. గ్రామ సచివాలయం మహిళా పోలీసు ప్రతినెల మొదటి, మూడు శుక్రవారాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి బాల్య వివాహాల నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు కిషోర్ వికాసం కింద వారంలో రెండు రోజులు శిక్షణా తరగతులను నిర్వహించి రుతుస్రావం పరిశుభ్రత, సెల్ఫ్ టిఫిన్స్, తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. కొన్ని రద్దయిన స్వచ్ఛంద సంస్థలను నిబంధనల ప్రకారం శాశ్వతంగా మూసి వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్ శక్తి పథకం కింద 18 ఏళ్లు పైబడిన మహిళలు నిరాధారణకు గురైన, లైంగిక వేధింపులకు గురైన వారికి వసతి గృహంలో ఉంచి వైద్య సహాయం, న్యాయ సహాయం అందేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఐ సి డి ఎస్ పిడి బి.సుజాతరాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్.రాజేష్, డీఈవో ఇ.నారాయణ, డి ఎం ఎన్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతాబాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాజేశ్వరరావు, జిల్లా వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.