విద్య ద్వారానే సమాజంలో గౌరవంతో పాటు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేద్దాం..
బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండి చదువుకునే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
“అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం” సందర్భంగా బుధవారం జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం చౌక్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఎ.లక్ష్మి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి డి.లక్ష్మి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి ఆర్.రాజేష్, క్రాప్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆర్.శ్రీనివాసరావు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, సత్య సుధామ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 12వ తేదీన అంతర్జాతీయ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండి చదువుకునే విధంగా కృషి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.14 సంవత్సరాల వయసు లోపు ఉన్న బాలలను దుకాణములు, సంస్థలు, హోటల్స్, డాబాలు, రెస్టారెంటీలు, కర్మాగారాలు, ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు, ఇళ్లలోనూ ఎక్కడైనా నిబంధనలను ఉల్లంఘించి బాలలతో పని చేయించుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులైన విద్య, పోలీస్, మహిళా శిశు సంక్షేమం, సాంఘీక సంక్షేమం, వైద్య ఆరోగ్య, రెవిన్యూ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో తనిఖీలు నిర్వహించి 2022 నుండి 2025 వరకు 93 మంది బాల కార్మికులను పని ప్రదేశాల నుండి విడుదల చేయించి పాఠశాలలు, కళాశాలలో చేర్పించడం జరిగిందన్నారు. ఆయా దుకాణ, సంస్థల యజమానులపై కనీస వేతన చట్టం అమలు చేసి రూ.2,82,044/- లు వసూలు చేసి బాలలకు అందించడం జరిగిందన్నారు. 14 సంవత్సరాల లోపు వయసు గల బాల బాలికలను పనిలో నియమించుకున్న 31మంది దుకాణాలు, సంస్థల యజమానులపై ప్రాసిక్యూషన్ ఫైల్ చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించాలని, నేటి ప్రభుత్వం విద్యపై ఎంతో ఖర్చు పెడుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం ఏర్పాటుతో పాటు పుస్తకాలు, దుస్తులు కూడా ఉచితంగా అందజేస్తుందని అన్నారు. కళాశాల స్థాయి విద్య వరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తమ పిల్లలను శ్రద్ధతో చదివించి వారికి సమాజంలో ఉన్నత స్థానం కల్పించాలని కోరారు.
ఈ ర్యాలీలో జిల్లా కార్మిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.