Close

వాతావరణం సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఎండ వేడి నుండి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

Publish Date : 18/05/2025

స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం హిట్ ద బీట్ థీమ్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తణుకు జిల్లా ఆసుపత్రి నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తణుకు ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ కుడివైపున నిర్మించనున్న పింక్ టాయిలెట్స్ కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ ప్రాంగణం అంతా కలియతిరిగి పరిశుభ్రత పరిశీలించారు. కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న హోటల్ ను, స్త్రీల మరుగుదొడ్లను పరిశీలించి డిపో మేనేజర్ కు తగు ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆర్టీసీ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రయాణికులకు చల్లని మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలను పల్లెల్లో పట్టణాల్లో ఏర్పాటు చేసి పరిశుభ్రతకు కృషి చేస్తున్నదని, దీనికి ప్రజలందరూ సహాయ సహకారాలను అందించాలన్నారు. ముఖ్యంగా నీటి వనరులను కలుషితం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని, ఇలా చేయకపోతే భవిష్యత్తులో నీరు అత్యంత ఖరీదైనదిగా మారుతుందని హెచ్చరించారు. చెట్లను విరివిగా ద్వారా నాటడం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చునని, ఎండ వేడికి రక్షణ పొందవచ్చని తెలిపారు.

శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛత అనేది ప్రభుత్వం ఒక్కటే నిర్వహించడం చాలా కష్టమైన పని అని, స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరిలో ఏర్పడాలన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడంతో చెత్త పేరుకు పోయి రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడతామని, సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడం మన అందరి బాధ్యత అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, డిసిహెచ్ఎస్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, హాస్పటల్ సూపరింటెండెంట్ వి.అరుణ, ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు కామరాజ్, ఆర్టీసీ డిపో మేనేజర్ సప్ప శ్రీధర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

22 2.11