Close

వందే భారత్ ట్రైన్ నరసాపురం వరకు పొడిగింపుకు కృషి –కేంద్రం ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

Publish Date : 02/06/2025

జాతీయ రహదారి 165 కు సంబంధించి భూములు ఇచ్చిన రైతులకు 7.4 కోట్ల పరిహారం చెల్లింపు

జిల్లాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాం.

సోమవారం భీమవరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి పాత్రికేల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆకివీడు – దిగమర్రు మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి 165కు సంబంధించి భూములిచ్చిన ఆకివీడు దుంపగడప, అజ్జమూరు తదితర గ్రామాల రైతులకు రూ.7.4 కోట్లు పరిహారాన్ని చెల్లించామన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఆకివీడు, ఉండి జాతీయ రహదారి కోసం భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన నిధులు పెండింగ్ లో ఉన్నాయని, రైతులకు ఇవ్వాల్సిన సొమ్ములు ఇతర సమస్యలపై దృష్టి సారించి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఆర్డీవోలతో రైతులకు నష్ట పరిహారాన్ని అందజేయడానికి ప్రత్యేకంగా కృషి చేశానన్నారు. రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం తోపాటు సుమారు 6, 7 సంవత్సర కాలాలకు సంబంధించిన వడ్డీని కూడా చెల్లించడం జరిగిందన్నారు. జాతీయ రహదారి నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైల్వే సర్వీసులను అందుబాటులోకి తేవడానికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. జాతీయ రహదారి 216కి సంబంధించి లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, మొగల్తూరు రైతులకు సుమారు రూ.6 కోట్లు చెల్లింపుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక వారం రోజులులోనే ఆ సొమ్ములు రైతుల ఖాతాలలో జమ కానున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన భీమవరంతోపాటు ఇతర నియోజకవర్గాల్లో మొత్తం 40 ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కృషి చేస్తున్నానని, ఆకివీడు నుంచి దిగమర్రు జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించనునట్లు తెలిపారు. జిల్లాలో మూడు రైల్వే స్టేషన్లను అమృత భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయడం జరుగుచున్నదన్నారు. త్వరలో ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయని తెలిపారు. జిల్లాకు సంబంధించిన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి సంబంధిత అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నానని, వాటిని త్వరలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ రైళ్లను ముఖ్యమైన స్టేషన్లలో హాల్ట్ కొరకు సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. వందే భారత్ రైలును చెన్నై నుంచి నరసాపురం వరకు త్వరలో పొడిగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ వరకు మాత్రమే నడుస్తుందని, అలాగే అత్తిలి, వీరవాసరం లాంటి రైల్వే స్టేషన్ లో విశాఖ, నాగర్ సోల్, సర్కార్ ఎక్స్ ప్రెస్ లకు హాల్ట్ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చొరవ వల్ల రైతులకు పరిహారం చెల్లింపు జరగడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. పెండింగులో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.

పత్రిక విలేకరుల సమావేశంలో భీమవరం ఆర్డీవో కే.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జాతీయ రహదారుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజీవరాయుడు పాల్గొన్నారు.