రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్, రెవిన్యూ డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి.
శుక్రవారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు పౌర సరఫరాలు, సహకార, రవాణా శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న దృష్ట్యా సంబంధిత అధికారులు సత్వరమే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న గోనె సంచులు, ఇంకను కావలసిన గోనె సంచులు, వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు వంటి అంశాలపై చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణ సమయంలో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి తమకు నివేదిక పంపించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్ఓ ఎన్.సరోజ, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి ఎంవి కృష్ణారావు, ఏఎస్ఓ ఎం.రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.