మాక్ డ్రిల్ అవగాహనతో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు

అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పరిసర ప్రాంత ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి అనే అంశాలపై రాష్ట్ర విపత్తుల సహాయబలం ( ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్), అగ్నిమాపక, పోలీస్, రెవిన్యూ, వైద్య శాఖలు సంయుక్తంగా బుధవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, తుపాను, వరదల సమయంలో ప్రజలు ఏవిధంగా స్పందించాలి, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివిధ అంశాలపై అవగాహన కలిగించేందుకు మాక్ డ్రిల్ ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా బాంబు బ్లాస్ట్, అగ్ని ప్రమాదం, గ్యాస్ లీకేజ్, భవనాలు కూలిన సందర్భంలో ఏ విధంగా సురక్షితంగా బయటపడాలో ఏ ఏ శాఖలు ఏ విధంగా సేవలు అందిస్తాయో ఉదాహరణలు చూపిస్తూ చక్కగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం భవిష్యత్తులో ఇటువంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలు మరిన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఇటువంటి మాక్ డ్రిల్స్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ప్రజలు తమను తాము రక్షించుకోవడంతోపాటు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా కాపాడుకోవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకేజీని సిఓ2 ద్వారా, మన దగ్గర ఉన్న బకెట్ తో ఏ విధంగా మంటలను కట్టడి చేయవచ్చో జిల్లా కలెక్టర్ స్వయంగా చేసి చూపించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అప్పటికప్పుడు ఏ విధంగా స్పందించాలో తెలియదని, దానివల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని, ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ప్రజలకు అవగాహన కలిగి ప్రమాదాల బారి నుండి బయటపడవచ్చు అన్నారు. ఏపీ ఎస్ డి ఆర్ ఎఫ్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖలు సమన్వయంతో మాక్ డ్రిల్ చక్కగా నిర్వహించారు అన్నారు.
తొలుత ఏపీఎస్డిఆర్ఎఫ్, రెవిన్యూ, అగ్నిమాపక, విద్యుత్ శాఖలు వాస్తవంగా ప్రమాదాల సమయంలో ఏ విధంగా స్పందిస్తాయో పలు అంశాలను కళ్ళ కట్టినట్లు చేసి ప్రదర్శ ద్వారా అవగాహన కల్పించారు. ప్రదర్శన వాస్తవ సంఘటనలను ప్రతిబింబించేలా ఉండటంతో బస్టాండ్ కు వచ్చి, పోయే ప్రయాణికులలో ఏం జరిగిందో అనే ఆందోళన కనిపించింది. మాక్ డ్రిల్ ప్రదర్శన ఆధ్యాంతం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఏ.శ్రీనివాసరావు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజలకు వివరించారు. గ్యాస్ బండ పేలడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని, 500 సెల్సియస్ ఉష్ణోగ్రతకు పీడనం పెరిగినప్పుడు మాత్రమే గ్యాస్ బండ పేలుతుందని, సాధారణ ఉష్ణోగ్రతలకు ఏ విధమైన ప్రమాదం ఏర్పడదన్నారు. గ్యాస్ లీకేజీ సందర్భంలో ఏర్పడిన మంటను అదుపు చేయడం చాలా సులభమని సాధ్యమైనంత వరకు బండ వద్ద బర్నర్ను ఆఫ్ చేస్తే సరిపోతుందని, లేనిపక్షంలో బండ సైజు ఉన్న బొకేట్ను బోర్లించి మూసినా, గోనే సంచెను గాని, మందపాటి వస్త్రాన్ని గాని తడిపి బండ చుట్టూ మూసివేస్తే మంటను అదుపు చేయడం సులువు అన్నారు.
మాక్ డ్రిల్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ డి ఆర్ ఎఫ్ కమాండెంట్, ఎం.నాగేంద్రరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎ. శ్రీనివాసరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్ వి ఆర్ వర ప్రసాద్, డి.ఎస్.పి ఎం.మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, తహాసిల్దార్ రావి రాంబాబు, ఆర్ఎస్ఐ రఘు, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం కాకినాడ, రెవిన్యూ, విద్యుత్తు, మెడికల్, పోలీస్, అగ్నిమాపక శాఖ మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.