ప్రతి పట్టణం, గ్రామంలో ప్రతి మహిళ ఇంటి ఆవరణలో ప్లాస్టిక్ డబ్బాల్లో కంపోస్ట్ తయారు చేసి కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు వినియోగించడం ద్వారా తడిచెత్త డంపింగ్ కాకుండా సద్వినియోగం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి తెలిపారు.

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం ఒక థీమ్ తో నిర్వహించే కార్యక్రమానికి శనివారం తణుకు పట్టణంలో ఏర్పాటుచేసిన “హిట్ ద బిట్” కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద కొబ్బరి బొండాల దుకాణదారులకు ఐడి కార్డులను అందజేశారు. పట్టణంలో మొత్తం 24 మంది కొబ్బరి బొండాల దుకాణదారులను గుర్తించి మున్సిపల్ కార్యాలయం ద్వారా ఐడీ కార్డులను జారీ చేయడం జరిగింది. తాగి పడేసిన కొబ్బరి బొండాలను ఎక్కడపడితే అక్కడ పడకుండా కచ్చితంగా డంపింగ్ యార్డ్ కి చేర్చాలని, అలా చేయని వారికి ఫైన్ ఫైన్ విధించడంతోపాటు, లైసెన్స్ ను కూడా రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. మండే ఎండల్లో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం అరుంధతి పేటలో గుర్రపుడెక్కతో నిండిపోయిన చెరువును శుభ్రపరచేందుకు డ్రోన్ ద్వారా పిచికారి మందును చల్లిస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ విజన్ 2047 లో భాగంగా జిల్లా యంత్రాంగం, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పరిశుభ్రత కొరకు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడవ శనివారం ఒక రోజు ఈ కార్యక్రమాన్ని చేసి మర్నాడు మర్చిపోవడంతో సరిపెట్టకుండా ప్రతి పట్టణంలో, గ్రామంలో నిరంతరం కొనసాగాలన్నారు. మహిళలు ఇంటి ఆవరణలో ప్లాస్టిక్ డబ్బాలలో తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారుచేసి కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు వినియోగించాలన్నారు. తడి చెత్త ఇంటి నుండి బయటకువెళ్లకుండా ఉంటే బాగుంటుందని సూచించారు. ఈరోజు నగరంలో ఉన్న చెరువును డ్రోన్ తో ముందును పిచికారి చేయించడం జరుగుతుందని అన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ తదితర వ్యర్ధాలు వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్ననాటి నుండి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తే బాగుంటుందని సూచించారు. మన ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో అలాగే బయట ప్రదేశాలు పరిశుభ్రత లేకపోతే సీజనల్ వ్యాధులకు మనమే ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతామని హెచ్చరించారు. నగరంలో ఎంతో ఖర్చు చేసి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నామని, వాటిని అపరశుభ్రంగా చేసి పాడు చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అమృత తుల్యమైన నీళ్లతో కలపవద్దని హెచ్చరించారు. పెద్దవాళ్లు ఇవే నీటిని తాగేవారమని చెబుతున్నారని, రాబోయే రోజుల్లో నీళ్లు ఎక్కడ అంటే పిల్లలు బాటిల్స్ లో చూపించే పరిస్థితి రాకూడదని త్రాగునీటి వనరులను సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రజలందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణంద్ర కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి స్వచ్ఛతపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రతినెల ఒక థీమ్ ఏర్పాటుచేసి పారిశుధ్యాన్ని, పరిశుభ్రతను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారని, ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రజలు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలన్నారు. ఈనెల హీట్ ది బీట్ అనే థీమ్ తో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తాగునీటి వనరులను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా శుభ్రపరచుకోవడానికి చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. 6,7 వార్డుల్లోని చెరువును శుభ్రపరిచి చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టి, వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మన ముఖ్యమంత్రి విజన్ 2047 పేరిట, మన ప్రధానమంత్రి వికసిత్ భారత్ పేరిట స్వచ్ఛతకు పిలుపునిచ్చారని, వారి అడుగుజాడల్లో మనమందరం నడిచి స్వచ్ఛభారత్ ను నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మార్కెట్ యార్డ్ నందు కూరగాయలు వేస్ట్ తో కంపోస్ట్ ను తయారు చేస్తున్న విధానాన్ని ప్రత్యేక అధికారికి మున్సిపల్ కమిషనర్ వివరించారు.
చివరిగా అందరితో స్వచ్ఛ్ ఆంధ్ర పై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, ఐ సి డి ఎస్ పి.డి బి.సుజాత రాణి, తహసిల్దార్ వర్మ,, స్థానిక నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.