పరిశుభ్రమైన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టడానికి ప్రజలు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు ఆదిత్య కాలనీ యుహెచ్సి ఎదురుగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మొక్కలకు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను ఏర్పాటు చేసి, తద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేందుకు ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా ప్రతీనెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేయడం, కాలువలను శుభ్రం చేయడం, మొక్కలను నాటడం తదితర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అన్నారు. వ్యాధులు సోకకముందే వాటిని నివారించడం ఎంతో ముఖ్యం అన్నారు. ప్రజలంతా తమ ఇంటితోపాటు, పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. చెట్లు నరికివేయడం వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, పచ్చదనం పెంపొందించకపోతే భవిష్యత్తు తరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. స్థలం లేని ప్రాంతాలలో టెర్రస్ గార్డెన్ లను ప్రోత్సహించాలని సూచించారు. టెర్రస్ గార్డెన్ ద్వారా ఇంట్లోకి అవసరమైన కూరగాయలు పండించుకోవచ్చని, ప్రకృతికి అవసరమైన పచ్చదనం పెరుగుతుందని, మొక్కలకు సేవ చేయడం ద్వారా శారీరక శ్రమతో ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఇంటి వ్యర్థాలతో సహజ ఎరువులు తయారు చేయవచ్చన్నారు. ప్రతి ఇంటి ముందు కనీసం ఒక చెట్టును నాటడం, టెర్రస్ గార్డెనింగ్ ప్రోత్సహించడం ద్వారా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన సమాజంను నిర్మించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, తాహసిల్దార్ వై.దుర్గా కిషోర్, ఆర్ పి లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.