తణుకు జిల్లా ఆస్పత్రిని అందరి సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు

శనివారం తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.అరుణ గత సమావేశంలో నమోదు చేసిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ ఆమోదం కొరకు ఉంచిన 26 అంశాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. కొన్ని పనులకు ఆమోదం తెలుపగా, మరికొన్ని అంశాలు సంబంధించి సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ప్రతి పనిని కమిటీ సభ్యులతో చర్చించి ఆమోదం పొందిన తర్వాతే చేపట్టాలని సూచించారు. హాస్పటల్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ సకాలంలో రెన్యువల్ చేయకపోవడంపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రికి ప్రధాన వనరుగా ఉండాల్సిన బ్లడ్ బ్యాంకు రెన్యువల్ విషయంలో అలసత్వం వహించడం తీవ్ర చర్యగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోగులకు అందించే భోజనాన్ని సప్లై చేసేందుకు డైట్ కాంటాక్ట్ మార్చి నెలాఖరు నాటితో ముగియడంతో సర్వీసును కొనసాగించడానికి ఇప్పటివరకు ఎందుకు ప్రతిపాదనలను సమర్పించలేదని నిలదీశారు. వెంటనే ప్రతిపాదనలను సిద్ధం చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ ద్వారా ఆమోదం పొందాలని ఆదేశించారు. కంటి సర్జరీలు, ఆర్థోపెడిక్ సేవలు అందడం లేదని పలు ఫిర్యాదులు వస్తున్నాయని శాసనసభ్యులు సమావేశం దృష్టికి తీసుకురాగా దీనిపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. హాస్పిటల్లో ప్రధానంగా కంటి వైద్యులు, ఆర్థోపెడిక్, పిజిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని దీని కారణంగా సర్వీసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఆసుపత్రిలో ప్రధాన విభాగాల్లో వైద్యుల కొరతపై వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి లేఖరాసి భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతినెల కంటి పరీక్షలు క్యాంపును నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించి, కళ్ళజోళ్ళు అందజేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బిల్డింగ్ నిర్మాణం చేసి పైన ప్లాస్టింగ్ చేయకుండా వదిలేసినందుకు ఏపీ ఎం ఐ డి సి ఇంజనీర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకువీడు ఆసుపత్రి భవనం నందు కూడా ఇలానే చేశారని, తణుకు, ఆకువీడు ఆసుపత్రుల బిల్డింగులు పై భాగంలో ప్లాస్టింగ్ పనులను పూర్తిచేసి పదిహేను రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో డయాలసిస్ పేషంట్లకు బెడ్లను 10 నుండి 15 వరకు పెంచడం జరిగిందని, డాక్టర్ల నియామకాలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కంటి విభాగాన్ని, తల్లి పిల్లల విభాగాన్ని, ఫిమేల్ వార్డులను పరిశీలించి ఆసుపత్రి సూపరింటెండెంట్ పలు ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఆర్డిఓ కతీబ్ కౌసర్ భానో, డి సి హెచ్ ఎస్ డాక్టర్ పగడాల సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి అరుణ, డిఎంహెచ్వో డాక్టర్ జి.గీతా బాయి, ఆర్ ఎం ఓ డాక్టర్ ఎల్ సాయి బాలాజీ, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, కమిటీ సభ్యులు కామరాజ్, డాక్టర్ అయేషా ఖాన్, కే. కిరణ్మై, గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.