ఆసుపత్రులలో రోగులకు అందుతున్న సేవలపై వైద్యాధికారులు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవం చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి..
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆస్పత్రులలోనే మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..
మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నరసాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓ.పి రిజిస్టర్లు, పలు విభాగాలను, వైద్య సేవలు అందించే అన్ని వార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డులో చంటి బిడ్డ తల్లులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో డాక్టర్లు ప్రతిరోజు వచ్చి శ్రద్ధగా చూస్తున్నారా, మీకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, బెడ్ షీట్లు రోజూ మారుస్తున్నారా అని ప్రశ్నించి అడిగి సమాచారం తెలుసుకున్నారు. టాయిలెట్స్, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డి సి హెచ్ ఎస్, ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్యాధి కారులుతో మాట్లాడుతూ సిబ్బంది పనితీరు, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, వారికి అందిస్తున్న మందులు, ఆసుపత్రికి ప్రతిరోజు వచ్చే రోగుల సంఖ్య, ఆసుపత్రిలో జరుగుతున్న ఆపరేషన్లు వంటి విషయాల పై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు, డాక్టర్లు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెంచేందుకు గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ పద్మావతి ముందుకు రావడం పట్ల జిల్లా కలెక్టర్ ఆమెను అభినందించారు. కంటి వైద్యానికి సంబంధించి ఏ స్కాన్ అవసరమని కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ స్పందించి ఏ స్కాన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ విధుల నిర్వహణలో షిఫ్ట్ వారీగా పనిచేసి రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా చూడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. రెవిన్యూ డివిజనల్ అధికారి, మున్సిపల్ కమిషనర్ మరియు ఆసుపత్రి కమిటీ సభ్యులు తరచుగా ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు పరివేక్షించాలన్నారు. చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లకు సంబంధించి అవసరమైన మిషన్లు వైద్య సేవ నిధుల ద్వారా కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గుండెపోటు వచ్చిన సమయంలో ప్రాణాపాయ స్థితి నుండి కాపాడడానికి రూ.45 వేలు విలువైనతేనిప్లేక్టసే (Teniplactase) ఇంజక్షన్ ఉచితంగా చేయడం జరుగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఈ ఇంజక్షన్ గురించి వైద్య సిబ్బంది ద్వారా అందరికీ తెలిసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కుక్కకాటు, పాము కాటుకు సంబంధించిన ఇంజక్షన్లు ఎప్పుడు ఆసుపత్రిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.ఆసుపత్రిలో ఏసీ, నాన్ ఏసీ గదుల అద్దె పెంపునకు సంబంధించి కమిటీ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆసుపత్రి అవసరాలకు నాలుగు ఏసీలు కొనుగోలుకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ దాసిరాజు, డి సి హెచ్ ఎస్ పి.సూర్యనారాయణ, ఆస్పత్రి కమిటీ సభ్యులు డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, డాక్టర్ ఎనుమల సతీష్, పోలిశెట్టి నళిని, ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ , డాక్టర్లు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహాసిల్దార్ సత్యనారాయణ, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.