Close

అనుమతులు లేని లే అవుట్ లలో నిర్మాణాలకు అనుమతించరాదు–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

Publish Date : 11/06/2025

జిల్లాలో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.

2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా టాక్స్ వసూళ్లను ప్రారంభించాలి.

బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి త్రాగునీరు, పన్ను వసూళ్లు, శానిటేషన్, అనుమతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు, తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలువలకు నీరు విడుదల అయినందున మంచినీటి చెరువులలో నీరు నింపుకొని సురక్షతమైన త్రాగునీరును ప్రజలకు సరఫరా చేయాలన్నారు. ముందుగా ట్యాంకులు, పైప్ లైన్ లీకేజీల మరమ్మత్తులు ఏమైనా ఉంటే వెంటనే రిపేర్లు పూర్తి చేయాలన్నారు. తాగునీరు కలుషితం అయితే డయేరియా ప్రభలే అవకాశం ఉందని కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో త్రాగునీటికి ఎక్కడైనా సమస్య ఉంటే ట్యాంకుల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. 2025 -26 సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా పన్ను వసూళ్లను సత్వరమే ప్రారంభించాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతినెల మూడో శనివారం మాత్రమే కాకుండా నిరంతరం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆదేశించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. వర్మీ కంపోస్ట్ తయారీ షెడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టి నూటికి నూరు శాతం పనిచేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలో అనుమతులు లేకుండా అనధికార లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు మార్జిన్లు, కాలవ గట్లు ఆక్రమించుకొని చిన్న, చిన్న టెంపుల్స్ నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోకుండా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. అక్రమణాల తొలగింపు సందర్భంలో కొంతమంది కోర్టుకు వెళ్తున్నారని, కోర్టు ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గ్రామ, వార్డు సచివాలయ అధికారి మరియు ఇన్చార్జి డిపిఓ వై.దోసి రెడ్డి, ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, డి ఎల్ పి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.