Close

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారులను కలిసి సమస్యలు పరిష్కారానికి శ్రద్ధ చూపాలి–జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

Publish Date : 09/06/2025

సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో పాటు డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, డ్వామా పి డి, కె.సి హెచ్ అప్పారావు అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్బంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తిస్ధాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నందున జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన, నాణ్యమైన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబందిత శాఖకు పంపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు. ఫిర్యాదుదారునితో మాట్లాడకుండా ఫిర్యాదును ముగించరాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుదారులతో మాట్లాడితే ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందే విధంగా జవాబు చెప్పి సమస్య పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రగతిపై శాఖల వారీగా సమీక్షిస్తూ జిల్లా అధికారులు ప్రతిరోజు కొంత సమయాన్ని ఫిర్యాదుల పరిష్కారానికి కేటాయించి మంచి ప్రగతి సాధించాలన్నారు.

ఈ రోజు పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీలలో కొన్ని ఇలా ఉన్నాయి

ఇరగవరం మండలం, ఇరగవరం గ్రామానికి చెందిన వీరమనేని రమాదేవి, వీరమేని కృష్ణబాబు అర్జీ సమర్పిస్తూ తమకు గ్రామంలో ఒక ఎకరం భూమి ఉందని, మా పూర్వీకులు నుండి భూమి శిస్తు చెల్లిస్తూ సాగు చేసుకుంటున్నామన్నారు.
మా భూమి ఆన్లైన్ అవ్వని కారణంగా ధాన్యం అమ్మ లేకపోతున్నామని, పలుమార్లు ఎమ్మార్వో గారికి ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారము కాలేదన్నారు. మా పొలాన్ని ఆన్లైన్ చేసి పాస్ పుస్తకం ఇప్పించాలని కోరారు.

పాలకోడేరు ఒకటవ డివిజన్ వివేకానంద కాలనీవాసులు అర్జీని సమర్పిస్తూ, పాలకోడేరులో ఉన్న రొయ్యల పరిశ్రమకు కాలనీలో మరియు సమీపంలో బోర్లు వేసి భూగర్భ జలాలను భారీ పైపులైన్ల ద్వారా నీరు తరలించేందుకు ఏర్పాటును జరుగుతున్నయాన్నారు. ఇప్పటికే సమీపంలో రొయ్యల పరిశ్రమకు సంవత్సరాల తరబడి నీరు తోడి వేయడం వల్ల భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని,కావున వెంటనే భూగర్భ జలాల తరలింపు నిలుపుదల చేసి మాకు భవిష్యత్తులో నీటి సమస్య లేకుండా చూడాలని కాలనీవాసన కోరారు.

అత్తిలి గ్రామ నివాసి పి.లక్ష్మి అర్జీ సమర్పిస్తూ, తనకు ఇద్దరు పిల్లలని తన భర్త తనను వదిలి వెళ్లిపోయారని, ఇద్దరి పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నామన్నారు. తనకు లివర్ పాడయినందున వైద్య చికిత్స చేయించుకోలేని పరిస్థిలో ఉన్నానని, నాకు ఎటువంటి ఆధారం లేదని తనకు పింఛను మంజూరు చేయవలసిందిగా కోరారు.

దిరుసుమర్రు ఒకటో వార్డు నివాసులు అర్జీ సమర్పిస్తూ తాము దిరుసుమర్రు కాలువ గట్టుమీద నివాసం ఉంటున్నామని, మా ఇళ్లను తీసివేసి 2023లో గుని పూడి గ్రామంలో మా పేరున పట్టాలు ఇచ్చారన్నారు. కానీ ఇప్పటివరకు మాకు స్థలం అప్పగించలేదని మాకు స్థలాలు కేటాయించి, ఇంటి నిర్మాణం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు.

మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామానికి చెందిన డి.నాగేశ్వరరావు అర్జీ సమర్పిస్తూ నవోదయం 2.0 కార్యక్రమం కింద పునరావాసం కల్పించేందుకు ఎంపిక చేశారని ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందలేదని, ఎక్సైజ్, డిఆర్డిఏ వారిని సంప్రదిస్తే స్పందించడం లేదని కావున ఆర్థిక సహాయం అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఓ కె.శ్రీనివాసరావు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్. వెంకటేశ్వర్రావు, డిఎం సివిల్ సప్లై స్ టి.శివరామ ప్రసాద్, డి ఎం అండ్ హెచ్ ఓ జి.గీతా బాయి, మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.