సరైన వైద్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని, ఇందుకు ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది కృషి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

బుధవారం భీమవరం విష్ణు కాలేజీ సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని వివిధ వైద్య అంశాలు, పౌష్టికాహారం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో డెలివరీలు చేయడం, మంచి వైద్య సేవలను అందించడం ద్వారా స్థానిక ప్రజలలో నమ్మకాన్ని పొందాలన్నారు. పీహెచ్సీలో డెలివరీకి వైద్యం దొరకదనే సందేహం ప్రజల్లో ఉండకూడదని, ఈ విధమైన కారణంతోనే ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఒక వారం రోజులు ముందే వెళ్ళి జాయిన్ అవ్వడంతో చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఒక డెలివరీకి ఖర్చు సుమారు యాభై వేల పైమాటే అని, ఈ విషయం వారిని ఆర్థికంగా దెబ్బతీస్తుందన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న పీహెచ్సీలలో డెలివరీలను కచ్చితంగా నిర్వహించాలన్నారు. మే నెలలో అత్యధిక డెలివరీలు నిర్వహించిన వేల్పూరు, పెనుమంట్ర, మంచిలి, లంకలకోడేరు, పొడూరు పీహెచ్సీల వైద్యాధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను, ఎత్తు, బరువు పెరగని పిల్లలను, పౌష్టికాహార లోపంతో మరాస్మస్ వ్యాధి కలిగిన పిల్లలు ఈ మూడు కేటగిరిల పిల్లలను గుర్తించి సరైన వైద్యం, పౌష్టికాహారం అందేలా చూడటంతో పాటు, వారి తల్లులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్క పిల్లలకు విడివిడిగా గ్రోత్ చార్ట్ నిర్వహించాలని ఆదేశించారు. పుట్టుకతో తక్కువ బరువు కలిగిన పిల్లలు పాలు కోసం ఏడ్చిన ఏడకపోయినా ప్రతి రెండు గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలన్నారు. అలాగే జెనెటిక్ ప్రాబ్లం కాకుండా ఎత్తు, బరువు పెరగని పిల్లలను ప్రభుత్వ పిల్లల వైద్యులకు చూపించాలన్నారు. పిల్లలు నమోదు కచ్చితంగా జరగాలని, ఆడ, మగ పిల్లల వ్యత్యాసం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కారణాలను విశ్లేషించడంతోపాటు, కారణం లేకుండా అబార్షన్లు ఏమైనా ఎక్కువ జరుగుతున్నాయా, ఆర్ఎంపీల పాత్ర ఏమైనా ఉందా అని ఆరా తీయాలన్నారు. అకారణంగా అబార్షన్లు నిర్వహిస్తే పి.సి.పి.ఎన్.డి.టి చట్టం ప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గర్భిణీ మహిళలకు ఎర్లీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, గర్భం దాల్చిననాటి నుండే మెరుగైన వైద్య సహాయం అందించడానికి దోహద పడుతుందన్నారు. బిపి, షుగర్, కిడ్నీ తదితర వ్యాధులు ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా వైద్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నారు. దీని ద్వారా మాతా, శిశు మరణాలను నిరోధించవచ్చు అన్నారు. వైద్య పరంగా డెలివరీ అయిన 40 రోజుల తర్వాత ఎవరైనా తల్లి మరణిస్తే మాతృ మరణంగా నమోదు చేయరని, ఐదారు నెలల వరకు అటువంటి తల్లులకు వైద్య సహాయాన్ని తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశాలు అందిస్తున్న సేవలు కారణంగా చాలా కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయని కొనియాడారు. కొన్ని ఏరియా హాస్పిటల్స్ లో డెలివరీలు చాలా తక్కువగా ఉంటున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలలో డెలివరీలు పెరగాలన్నారు. గర్భిణీలలో రక్తహీనత అనేది లేకుండా చూడాలని, సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యవంతమైన, తెలివిగల పిల్లలు పుడతారని, ఈ విషయాన్ని తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామం శివారు పంట పొలాల్లో ప్రసవించిన మహిళకు సకాలంలో వైద్య సేవలు అందించిన వైద్యాధికారిని, సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కౌమార దశ ఆడపిల్లలకు కిశోరి వికాసం పేరిట నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఈనెల 20 వరకు కొనసాగించాలని, సిడిపిఓలు, సూపర్వైజర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆడపిల్లలకు పరిశుభ్రత, రక్తహీనత, తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లకు ఆకర్షణలో జరిగే పొరపాటులను కూడా వివరించాలన్నారు. ప్రధానమంత్రి టిబి ముక్తభారత్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనిలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి సరైన సమయంలో వైద్య సహాయాన్ని, పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి.గీతా బాయి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డిఐఓ డాక్టర్ దేవ సుధాలక్ష్మి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి శ్రవణ్, డిపిఎంఓ సిహెచ్ ధనలక్ష్మి, ఏవో డాక్టర్ సిహెచ్ భావన, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ క్రాంతి, ఎస్.ఓ ప్రసాద్, మెడికల్ అధికారులు, సూపర్వైజర్లు, సిడిపిఓలు, ఐ సి డి ఎస్ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.