మన భీమవరంలో బోటు షికార్–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
బివి రాజు వీరమ్మ పార్క్ నందు బోటు షికార్ ఏర్పాటు
పెద్దలకు, పిల్లలకు బోటు షికారుతో ఆహ్లాదం..
నేడు వాటర్ బోటింగ్ ప్రారంభం..
భీమవరం ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు నేడు బివి రాజు వీరమ్మ పార్కులో బోటు షికారుని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా భీమవరం పట్టణంలోని బీవీ రాజు వీరమ్మ పార్క్ నందు బోటు షికారును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భవ్య భీమవరం పేరిట ఇప్పటికే పట్టణంలో పలు పార్కులు, కూడళ్ళు అభివృద్ధి, ఫౌంటెన్స్, స్వాగత ద్వారాలు ఏర్పాటు, డివైడర్స్ కు అందమైన పెయింటింగ్స్, పాత బస్టాండ్ లో నూతన టెర్మినల్ నిర్మాణం, పట్నంలో పలు బస్టాపులు నిర్మాణం, ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు తదితర ఎన్నో కార్యక్రమాలను పలువురు దాతల సహకారంతో చేపట్టి భీమవరం సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ వంటి పట్నాలలో మాత్రమే ఉన్న బోట్ షికార్ ను బివి రాజు ఫౌండేషన్ సహకారంతో నేడు బివి రాజు పార్క్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పట్టణ ప్రజలు ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు. పట్టణ ప్రజలకు ఇది ఒక ఆట విడుపులా ఉంటుందన్నారు. భీమవరం పట్టణంలో పిల్లలు, పెద్దలు సెలవు రోజుల్లో ఆనందంగా గడపడానికి ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఏమీ లేవని, దీని దృష్టిలో పెట్టుకొని దశలవారీగా పట్టణంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, అలాగే ప్రధానంగా ఉన్న వీరమ్మ పార్క్ లో అహ్లాదకరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక వారం రోజుల్లో లోపు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అడ్వర్డ్ ట్యాంక్ నందు కూడా బోటు షికారును ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బోటు షికారులో ఏ విధమైన భయోందోళనలు లేకుండా పటిష్ట రక్షణ చర్యలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. బోటింగ్ టైమింగ్స్, ఎంత సమయానికి ఎంత రుసుము చెల్లించాలి, తదితర వివరాలను సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ప్రస్తుతానికి వివిధ షేపుల్లో ఉన్న నాలుగు రకాల బోట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, వాటర్ రిక్షా రూ.50/- లు, నాలుగు సీటర్ బోటు రూ.30/- లు, రెండు సీటర్ బోటు రూ.50/- లు, అడ్వెంచర్ బోటు రూ.50/- లు ఒక్కొక్కరు బోటు షికారుకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బీవీ రాజు ఫౌండేషన్ సేవలు మరువలేని వని, భవిష్యత్తులో వారు పట్టణ అభివృద్ధికి మరింత సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు.
కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ టి.త్రినాధరావు, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, డిఆర్డిఏ పిడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి ఏ.అప్పారావు, బీవీ రాజు కళాశాల కోఆర్డినేటర్ ఎం.రమేష్ కుమార్, డిప్యూటీ తహసిల్దార్ మంతెన రాంప్రసాద్ రాజు, రెవిన్యూ శాఖ సిబ్బంది గ్రంధి రత్న కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
