ప్రభుత్వం పెద్ద మొత్తంలో సామాజిక పెన్షన్లు అందజేస్తున్నది, భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత పొదుపు చేసుకోవాలి.
సోమవారం ఉండి గ్రామం ఒకటవ వార్డులో డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంయుక్తంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎప్పటిలానే ఎన్టీఆర్ భరోసా సామాజిక భదత్రా పింఛన్లను అధికారులు, సిబ్బంది సోమవారం వేకువజామునే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారన్నారు. పేదల సమస్యలను అర్ధం చేసుకున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక పింఛన్లను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు, ఆ తరువాత రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచి వారిని ఆదుకున్నారన్నారు. గత ప్రభుత్వ హాయాంలో పింఛన్ను రూ.2వేలు నుంచి రూ.3వేలకు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉండేది కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సామాజిక పింఛన్లను రూ.50 వేలకోట్లు పైగా అందజేయడం జరిగిందని, ఈ రెండు రాష్ట్రాలు కలిపిన ఇంత భారీ మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. భారతదేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పెద్ద మొత్తంలో పెన్షన్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి మీపై ఉన్న ప్రేమ, మంచితనాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని గ్రహించాలన్నారు. లబ్ధిదారులు ఎంతో కొంత భవిష్యత్తు అవసరాల కోసం మదుపు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పి.డి ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిపిఎం మురళీకృష్ణ, సర్పంచ్ కమతం సౌజన్య, స్థానిక కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.