Close

ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద జిల్లాలో గుర్తించిన ఆరు గ్రామాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

Publish Date : 03/06/2025

సోమవారం పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జిల్లాస్థాయి పీఎంఏజీవై పథకం అమలు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 2020-21 సంవత్సరంలో పీఎంఏజీవై పథకం అమలుకు 50% పైబడి ఎస్సీజనాభా కలిగిన 10 గ్రామాలను, 2022-23 సంవత్సరంలో 40% పైబడి ఎస్సీజనాభా కలిగిన 11 గ్రామాలను మొత్తం 21 గ్రామాలను 9 మండలాల పరిధిలో నిబంధనల మేరకు ఎంపిక చేసి ప్రతిపాదనలను సమర్పించడం జరిగిందన్నారు. వీటిలో 10 గ్రామాలకు మాత్రమే గ్రామ అభివృద్ధి ప్రణాళికను సమర్పించడం జరిగిందని, విడిపి సమర్పించిన పెనుమంట్ర మండలం ఓడూరు, పెంటపాడు మండలం ఉమామహేశ్వర వరం, నరసాపురం మండలం నరసాపురం, సరిపల్లి, పోడూరు మండలం మిని మినిమించిలిపాడు, ఉండుర్రు (మామిళ్ళదొడ్డి) గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల రూపాయలు చొప్పున మొత్తం రూ.1.20 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వీటిని ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి గ్రామ అభివృద్ధి ప్రణాళికలో సూచించిన పనులకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మరో నాలుగు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని, వాటిలో ఆరుళ్ళ, బట్లమగుటూరు, పెద్ద మల్లం, చందాపర్రు ఉన్నాయన్నారు. ఇంకనూ గ్రామ అభివృద్ధి ప్రణాళికను సమర్పించాల్సిన 11 గ్రామాలకు సంబంధించి కూడా విడిపిలను సమర్పించాలన్నారు. జిల్లాలోని ఇప్పటికే గుర్తించిన 21 గ్రామాలను మినహాయించి, అన్ని మండలాల్లో ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం ఎంపికకు నిర్దేశించిన సర్వే ప్రకారం అర్హత కలిగిన గ్రామాలను గుర్తించి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. ఈ సర్వేను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2009-10లో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన యొక్క కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయడం ప్రారంభించిందన్నారు. దీని ద్వారా ఎస్సీ ఆధిపత్య గ్రామాలైన అంటే 50% కంటే ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్న గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రాంత ఆధారిత అభివృద్ధి విధానాన్ని ప్రారంభించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ పథకం 2014-15లో మరింత విస్తరించడం జరిగిందని, 2018-19 నుండి దీనిని కేంద్ర ప్రభుత్వం నిరంతర పథకంగా అమలు చేస్తున్నదని తెలిపారు. కనీసం 40% ఎస్సీ జనాభా ఉన్న కొత్త గ్రామాలను 2022-23లో పీఎంఎజీవై పథకం కింద భారత ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నూరు శాతం గ్రాంట్‌ను అందిస్తుందని, ఈ పథకం అమలుకు జిల్లా స్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నోడల్ అథారిటీగా వ్యవహరిస్తారు అన్నారు. 40% కంటే ఎక్కువ జనాభా ఉన్న ఎస్సీలు మరియు 500 కంటే ఎక్కువ గ్రామ జనాభా ఉన్న గ్రామాలను 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ పథకం కింద మంజూరు జరుగుతుందన్నారు. ఈ నిధులను త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, పౌష్టికాహారం, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణాలు, విద్యుత్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటలైజేషన్, లైవ్లీహుడ్, నైపుణ్యాభివృద్ధి కి సంబంధించి ముందుగా సమర్పించిన విలేజి అభివృద్ధి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామాంజనేయ రాజు, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి వై దోసి రెడ్డి, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, డీఈవో ఇ.నారాయణ, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్, ఎస్ఈలు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, డీఎస్ఓ, జెడి అగ్రికల్చర్, విద్యుత్, పబ్లిక్ వర్క్స్, డి పి ఆర్ ఓ, తదితరులు పాల్గొన్నారు.