పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీలను సకాలంలో నాణ్యతతో పరిష్కరించాలి–జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పి జి ఆర్ ఎస్ లో అందిన అర్జీలు137
సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి స్వీకరించిన అర్జీలు వాటి పరిష్కారం కొరకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి సమస్య త్వరగా పరిష్కరించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు కృషి చేయాలని అన్నారు. పదేపదే అర్జీదారులు కార్యాలయాలు చుట్టూ తిరగకుండా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అర్జీదారుల నుండి స్వీకరించిన కొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి
@ ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామం నుండి ఎర్రగోగు రామాంజనేయులు, తన భూమిని సర్వే చేయించి సరిహద్దులు చూపాలని కోరారు,
@ గణపవరం మండలం కొత్తపల్లి గ్రామం చేపల చెరువుల రైతులు కలవరామ సుబ్బారావు, బొడ్డు అప్పారావు, బి.మధు, తదితరులు గ్రామంలోని చేపల చెరువుల రైతులు వెళ్లే దారి మార్గమును గొర్లు శ్రీనివాసరావు, ఆక్రమించుకొని రైతులపై దౌర్జన్యం చేస్తున్నాడని చర్యలు తీసుకుని చేపల చెరువులకు వెళ్ళుటకు దారి మార్గం చూపాలని కోరారు.
@ అత్తిలి మండలం కంచుమర్రు గ్రామానికి చెందిన ఎం జయప్రసాద్, గ్రామంలోని పంట బోధి పూడికిపోయి వ్యవసాయ భూములకు నీరు రాక అవస్థలు పడుతున్నామని, పంట బోధి లోనికి పెట్టిన డ్రైనేజీలను తొలగించాలని కోరారు.
@ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 35 వార్డు చెందిన బండారు పార్వతి, ఏడు సంవత్సరాల క్రితం మతిస్థిమితం లేక తన భర్త ఎక్కడకో వెళ్లిపోయారని పోలీస్ కేసు పెట్టడం జరిగింది. నా బంధువులు నేను అనేక ప్రాంతంలో నా భర్త కొరకు వెతకగా ఆచూకీ తెలియలేదు నా భర్త తప్పిపోయి ఏడు సంవత్సరములు పైబడిన కారణంగా ఏ ఆధారము లేని తనకు ఒంటరి మహిళ పింఛను మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కేసిహెచ్ అప్పారావు, ఇది శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబునల్ సభ్యులు మేళం దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.