జిల్లాస్థాయి యోగా పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.

యోగాంధ్ర 2025లో భాగంగా యోగా ప్రదర్శనలు, పోటీలు, యోగ అభ్యాసం పట్ల ప్రజలలో అవగాహన పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక యోగ కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ, మండల స్థాయిలలో నిర్వహించిన యోగ పోటీలలో గెలుపొందిన వారికి భీమవరం పట్టణం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం యందు జూన్ 10 నుండి మూడు రోజులు పాటు జిల్లాస్థాయి యోగ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యోగా కార్యక్రమాలలో సూర్య నమస్కారాలు, యోగాసనాలు, గీత శ్లోకాలు, భగవద్గీత ఆవశ్యకతమైన వ్యాసరచన, గీత క్విజ్ పోటీలను మూడు కేటగిరీల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు జూన్ 10వ తేదీన 10 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. జూన్ 11 బుధవారం 18 నుండి 35 సంవత్సరముల వయసుగల వారికి, జూన్ 12 గురువారం 35 సంవత్సరముల పైబడిన వారికి యోగ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నలుగురు జ్యూరీ సభ్యులు జడ్జీలుగా వ్యవహరించి జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని విజేతలుగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు తదుపరి రాష్ట్రస్థాయికి వెళతారని ఆమె తెలిపారు.