జిల్లాలో సోలార్ ప్యానల్ యూనిట్లు రిజిస్ట్రేషన్, స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలులో భాగంగా సోలార్ పానెల్ యూనిట్ల రిజిస్ట్రేషన్, స్థాపన ప్రగతిని మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఈ పథకం అమలు మందకొడిగా సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం విస్తృత స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రంలోనే అనువుగా ఉన్న ఏకైక జిల్లా పశ్చిమగోదావరి జిల్లా అన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లాలోనే ఈ పథకాన్ని అమలు చేయలేకపోతే రాష్ట్రంలో ఎక్కడ పెద్ద స్థాయిలో అమలు చేయలేరున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైన జిల్లాలో అమలు టాప్ రెండు, మూడు స్థానాల్లో ఉంటుందని అటువంటిది ప్రధాన మంత్రి సూర్యా ఘర్ యోజన పథకం జిల్లాలో నత్త నడకన నడుస్తుందన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి రాబోయే రెండు నెలలో రాష్ట్రంలో రెండు, మూడు స్థానాలకు చేరేలా కృషి చేయాలన్నారు. బ్యాంకు రుణం మంజూరులో ఎటువంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బ్యాంక్ అధికారులును ఆదేశించారు. సోలార్ యూనిట్ల స్థాపన వల్ల కలిగే ప్రయోజనాలను విస్తృత స్థాయిలో ప్రజలలో అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించిన, క్షేత్రస్థాయిలో కార్యాచరణ లేకపోతే ఏ పథకము విజయవంతం కాదన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం విజయవంతం అయ్యేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. మంజూరైన యూనిట్లు స్థాపనలో వెండార్స్ ఎటువంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు. యూనిట్ల స్థాపనలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
ఈ గూగుల్ మీట్ లో జిల్లా విద్యుత్ శాఖాధికారి ఏ.రఘునాథ్ బాబు, డిఇలు, ఏఇలు, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.