Close

జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్, క్లాత్ బ్యాగ్ లను వినియోగించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

Publish Date : 02/06/2025

5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి

ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యూట్ లేదా క్లాత్ బ్యాగ్ లను వాడాలి

ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ఆచరించాలి

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

 

సోమవారం పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జూన్ 5న “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కల నాటడంతో పాటు, ప్లాస్టిక్ నిషేధం అమలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఆచరించాలన్నారు. మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో వాటి సంరక్షణ కూడా అంతే ముఖ్యం అన్నారు. జూన్ 5న మొక్కలు నాటడంతోపాటు, కాలువలు, డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతలను వివిధ శాఖలకు కొంత ప్రదేశం మేర అప్పగించడానికి ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్లాస్టిక్ కాలుష్యం నుంచి మన పశ్చిమగోదావరి జిల్లాకు సంపూర్తిగా విముక్తి కలిగిద్దామని, ప్లాస్టిక్ బయో డిగ్రేడబుల్ కాదని, ప్రకృతిని నాశనం చేస్తుందన్నారు. పశువులు, పక్షులు, జలచరాలు, మన ఆరోగ్యానికి, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు హాని కలిగిస్తాయన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకకుండా అవరోధం కలిగిస్తుందని, ప్లాస్టిక్ బ్యాగ్ లు ఉన్న చోట మొక్కలు మొలకెత్తవని అన్నారు. భూసారం దెబ్బతింటుందని, భవిష్యత్తు తరాల కోసం ఇవాళే నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, గ్రామ వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, డ్వామా పిడి డాక్టర్ కేసిహెచ్ అప్పారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫీల్డ్ అసిస్టెంట్ ఎన్.కె వెంకట రామ, రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ గోపిశెట్టి మురళీ కృష్ణారావు, పి.నాగబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.